శ్రీవైష్ణవ సంప్రదాయంలో, అందులోనూ మునిత్రయ సంప్రదాయ ప్రవర్థనములో పేరు పొందిన శ్రీమద్ పౌండరీకపురం ఆండవన్ ఆశ్రమం నేడు ఎంతోమంది శ్రీ వైష్ణవులకు ముఖ్య కేంద్రంగా ఉంది. శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న శ్రీరంగం కేంద్రంగా ఉన్న ఈ ఆశ్రమం నిత్యం వేద, ప్రబంధ పారాయణాలతో శ్రీ వైష్ణవశ్రీతో విలసిల్లుతూ ఉంటుంది. ఎంతోమంది మహాత్ములు ఈ ఆశ్రమ పీఠాధిపతులుగా వ్యవహరించారు. సుమారు 400 ఏళ్ల క్రితం అవతరించిన ‘మునిత్రయ సంప్రదాయ’ ప్రవర్తకులు శ్రీ తిరుక్కుడందై దేశికన్ స్వామి అడుగుజాడలలో ఈ ఆశ్రమ పరంపర నేటికీ కొనసాగుతోంది. ఈ ఆశ్రమ ఆచార్యులు తమ కఠినమైన అనుష్ఠానాలకు, నిరాడంబరతకు మరియు శాస్త్ర పాండిత్యానికి పేరుగాంచినవారు. ముఖ్యంగా గతంలో పీఠాధిపతులుగా ఉన్న శ్రీమద్ పరవాకోట్టై ఆండవన్ (గోపాల మహదేశికన్) స్వామి వారు దశాబ్దాల పాటు ఈ ఆశ్రమాన్ని ఎంతో నిష్ఠతో నడిపించారు.
ప్రస్తుతం ఈ పీఠానికి పరవాకోట్టై చిన్న ఆండవన్ గా పేరు గాంచిన శ్రీమద్ శ్రీనివాస గోపాల మహదేశికన్ స్వామి పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. వీరు తమ పూర్వాచార్యుల బాటలో నడుస్తూ, భక్తులకు సమాశ్రయణం మరియు భరణ్యాసం వంటి ఆధ్యాత్మిక సంస్కారాలను అందిస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో పర్యటించి ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా ఎంతోమందిని ఆకట్టుకుంటున్నారు. తమిళనాడుతోపాటు, ఉత్తరాది ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. తెలుగు రాష్ట్రాలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. నెల్లూరులోనూ, హైదరాబాద్ లోనూ ఆయన తిరుప్పావై ఉపన్యాసాలు కూడా చేశారు.
ఉ.వే. కాణియంబాక్కం ఇళయవిల్లి దేవనాథాచార్య
తిరుపతి.



