తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనంబి వంశీయులు శ్రీమాన్ ఉ.వే. టి.కె. ముకుందన్ తాతాచార్య స్వామి కైశిక పురాణం చేస్తూ, కైశిక ద్వాదశి విశిష్టతను తెలియజేశారు. తరువాత ఆలయ మర్యాదలతో ఆయనను తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు ఇతరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఊరేగింపుగా తేరువీధిలో ఉన్న తోళప్పమండపం వరకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్, శ్రీమాన్ కంభరాజపురం మురళీ అయ్యంగార్, తిరుమలనంబి వంశీయులు ఇతరులు పాల్గొన్నారు.
పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ప్రత్యేకం. శ్రీ వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. తమిళనాడులోని దివ్యదేశమైన తిరుక్కురుంగుడి దేవాలయంలో జరిగే కైశిక ఏకాదశి,ద్వాదశి వేడుకలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు.





